ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే జర్నలిజం రంగంలోకి ఫేక్ జర్నలిస్టులు చొరబడ్డారని, వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత పాత్రికేయ సంఘాలపైనే ఉందని నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఆదివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, వైజాగ్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్రతిభకు ప్రోత్సాహం' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సమాజంలో 24 గంటలూ శ్రమించే పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులు నిజమైన సమాజ మిత్రులని కొనియాడారు. అయితే, ఎంతో పవిత్రమైన జర్నలిజం వృత్తిని అడ్డుపెట్టుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.