తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా, భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.