తొట్టంబేడు మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాంతం జలమయమైంది. చిట్టత్తూరు వద్ద వాగు పొంగి పొర్లుతోంది. తిమ్మసముద్రం, బైరాజు కండ్రిగ, కేవీబీ పురం మండలాల ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో నీటి మట్టం మరింత పెరిగింది. దీనితో శ్రీకాళహస్తి–అంజూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదాలను నివారించేందుకు అటువైపు ఎవరూ వెళ్లవద్దని తొట్టంబేడు ఎస్ఐ బలరాం సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.