పల్నాటి తిరుమలగా పేరుగాంచిన దేవరంపాడు నేతి వేంకన్న ఆలయంలో సిబ్బంది భక్తులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ కల్యాణ టికెట్లు, తలనీలాల టోకెన్లు జారీ చేసి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని, వివాహాల సమయంలో నిర్ణీత రుసుములకు మించి వసూలు చేస్తున్నారని, సర్వర్ సమస్య పేరుతో డబ్బు తీసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. పాత తేదీలతో తలనీలాల టికెట్లు మళ్లీ విక్రయించినట్లు, హుండీలలోని కానుకలు మాయం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.