కాకినాడ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫలించింది. పిఠాపురం రైల్వేస్టేషన్కి మహర్దశ పట్టింది. డిప్యూటీ సీఎం ప్రయత్నాల మేరకు 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' పరిధిలోకి పిఠాపురం రైల్వేస్టేషన్ చేరింది. ఈ రైల్వేస్టేషన్ పునరుద్ధరణకు కేంద్రం రూ.37.25 కోట్లు కేటాయించింది. త్వరలోనే అభివృద్ధి పనులు చకచకా ప్రారంభం కానున్నాయి. దీంతో పిఠాపురం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. దీనిపై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో స్టేషన్ మరమ్మతు పనులు పెండింగ్లో ఉన్నాయని.. తమ అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో నేడు సమస్యలు తొలగిపోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.