కర్నూలు నగరంలోని వాణిజ్య దుకాణాల యజమానులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ప్రతి దుకాణంలో తప్పనిసరిగా డస్ట్బిన్ ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి అవసరమైతే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బుధవారం నగర పరిధిలోని 44వ జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లు, సుంకేసుల రోడ్డులో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. పరిశుభ్రతను మెరుగుపరచేందుకు ప్రత్యేక వాహనం, సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.