కర్నూలు వ్యవసాయ మార్కెట్యార్డులో కందులు, వేరుశనగ ధరలు భారీగా పడిపోయాయి. ఒకప్పుడు క్వింటా రూ. 9,200 పలికిన కందుల ధర ప్రస్తుతం రూ. 8 వేల లోపునకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మార్కెట్కు 3,655 క్వింటాళ్ల కందులు రాగా గరిష్ట ధర రూ. 7,901, సగటు ధర రూ. 7,801గా నమోదైంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లలో ధరలు ఇంకా తక్కువగా ఉన్నాయి. వేరుశనగ ధర కూడా క్వింటా రూ. 15 వేల నుంచి ఒక్కసారిగా పడిపోగా, ప్రస్తుతం రూ. 5,625 నుంచి రూ. 9,018 మధ్య లభిస్తోంది. కేవలం నాలుగు రోజులలోనే ధరలు గణనీయంగా తగ్గాయి.