ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన 35 మంది రైతులకు ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయాన్ని నిలిపివేస్తూ కలెక్టర్ కె.హరిత నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గంజాయి సాగు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు, బస్సుల తనిఖీలను ముమ్మరం చేయాలని, డ్రగ్స్ దుష్ప్రభావాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.