గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన అవహేళన మాటలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, హిందూ దేవుళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెళ్లికాని వారికి హనుమంతుడు, మందుతాగేవారికి మరో దేవుడు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని, కేవలం రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.