జాతీయ స్థాయి ఖేలో ఇండియా యోగాసన సౌత్ జోన్ పోటీలకు కొమురం భీమ్ జిల్లా రెబ్బేన మండలం గంగాపూర్కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్లో జరుగనున్నాయి. ఎంపికైన విద్యార్థులు కుమ్మరి శ్రీవల్లి, సెండే మహేశ్వరి, సెండే కావేరి, మోర్లే ఇందు, గుర్లే శ్రావణి. ఇది జిల్లాకు గర్వకారణమని జిల్లా యోగాసన అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన చేసి పథకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులను యోగాసన సంఘం నాయకులు అభినందించారు.