తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటి. పథకం అమలుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు స్పందించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కళ్యాణలక్ష్మితో పాటు ఈ పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. ఐదేళ్లలోపు అన్ని హామీలు నెరవేరుస్తామని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలన్నీ 100 శాతం నెరవేరుస్తామని, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.