యమునా నది వరద ముప్పు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నీరు ఉప్పొంగి, ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద డేంజర్ మార్క్ (205.33 మీటర్లు) దాటింది. శనివారం రాత్రి 8.30 గంటలకు నీటిమట్టం 205.52 మీటర్లకు చేరింది. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజీల నుంచి భారీగా నీరు విడుదల అవుతోంది. మట్టం 206 మీటర్లకు చేరితే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు.